Part time Jobs | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాలిస్తామని సెల్ఫోన్లకు మెసేజ్లు పంపిస్తూ హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే రోజుకు కనీసం రూ.1.5 కోట్ల వరకు దోపిడీ చేస్తున్నట్టు సమాచారం. బాధితులు అత్యధికం చదువుకొన్నవారే ఉంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని సైబర్ ఠాణాలకు వస్తున్న ఫిర్యాదుల్లో 70 శాతం ఇలాంటి మోసాలకు సంబంధించినవే ఉంటున్నాయి. త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతోనే ఇలాంటి మోసానికి గురవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ‘ముందుగా మాకు కొన్ని టాస్క్లు ఇచ్చి.. వాటిని క్లిక్ చేయమని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఒకో క్లిక్కు రూ.50 చొప్పున మా బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు. మాకు నమ్మకం కలిగేలా రెండుమూడు సార్లు ఇలా చేయడంతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాం’ అని బాధితులు పోలీసుల ఎదుట వాపోతున్నారు.
మోసాన్ని గుర్తించండి!
కొందరి సెల్ఫోన్లకు సైబర్ నేరగాళ్లు వివిధ రకాల పార్ట్టైమ్ ఉద్యోగాలిస్తామని మెసేజ్లు పంపిస్తుంటారు. వాటికి కొందరు మాత్రమే స్పందిస్తారు. అలా స్పందించిన వారు ఆ మెసేజ్ను పూర్తిగా చదివి దాని గూర్చి తెలుసుకోవడానికి ప్రయత్నించేందుకు అందులో ఉండే లింక్ను క్లిక్ చేస్తారు. ఆ లింక్ నేరుగా వాట్సాప్కు వెళ్తుంది. వాట్సాప్లో యూట్యూబ్ లింక్లు క్లిక్ చేయాలని కేటుగాళ్లు సూచిస్తారు. యూట్యూబ్లో పార్ట్టైమ్ జాబ్ విధానాన్ని వివరిస్తారు. ‘చాలా కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్లను అధిక మంది వీక్షించేలా ప్రయత్నిస్తారు. దాంతో వాళ్లకు వ్యాపారం పెరుగుతుంది. మీకు డబ్బు వస్తుంది’ అని ఆకర్షించేలా వివరిస్తారు. ఆ మాటలు నమ్మిన బాధితులకు మరింత నమ్మకం కలిగించేందుకు ఉచితంగా రూ.150 తీసుకోండి అంటూ ఆఫర్ ఇచ్చి, ఆ డబ్బును బాధితుల యూపీఐ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. అనంతరం వారిని టెలిగ్రామ్లోకి రావాలంటూ ఆహ్వానించి, తమ స్పెషల్ గ్రూప్లో సభ్యునిగా చేర్చుకుంటారు. అనంతరం యూట్యూబ్/ఇన్స్టాగ్రామ్/గూగుల్ రివ్యూ తదితర ఏదైనా ఒక విషయంపై మూడు టాస్క్లు చేయాలని, ఒక్కో టాస్క్కు కొంత డబ్బు వస్తుందని నమ్మిస్తారు.
ఒకో టాస్క్కు రూ.50 చొప్పున మూడు టాస్క్లకు రూ. 150 చెల్లిస్తారు. ఇలా బాధితుడికి రూ.300 వస్తాయి. ఇక బాధితుడికి సైబర్ నేరగాడిపై నమ్మకం కుదిరి, వాళ్లు చెప్పినట్టు చేయడం ప్రారంభిస్తాడు. ఇక్కడే మీరు డబ్బుతో ప్రీపెయిడ్ టాస్క్లను కొనాల్సి ఉంటుందంటూ ఒక లింక్ను పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రూ.1000 నుంచి రూ. 20 వేల వరకు పెట్టుబడి పెట్టాలంటూ సూచిస్తారు. పెట్టుబడిపై 30 శాతం లాభం వస్తుందంటూ నమ్మిస్తారు. అరగంటలో పెట్టిన పెట్టుబడిపై 30 శాతం లాభం అనగానే బాధితులు ఆకర్షితులవుతారు. బాధితుడి మానసిక పరిస్థితిని గుర్తించి వీలైతే ఇక్కడ మొదటిసారి పెట్టిన పెట్టుబడిలో ముందుగా 30 శాతం లాభం ఇస్తారు. ఆ తరువాత లక్షల్లో పెట్టుబడి పెట్టాలంటూ సూచిస్తారు. ఆ వెబ్సైట్లో మీరు పెట్టిన పెట్టుబడి, దానికి లాభం కలుపుతూ నంబర్లను చూపిస్తారు. డబ్బు డ్రా చేసుకొనేందుకు మాత్రం అనుమతించరు. గతంలో పెట్టిన పెట్టుబడికి లాభాలు రావాలంటే, మరో ప్రీపెయిడ్ టాస్క్ తీసుకోవాలని ఒత్తిడి చేసి భారీగా పెట్టుబడి పెట్టిస్తారు. ఇలా రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు కూడా పెట్టుబడి పెట్టి మోసపోయినవాళ్లు ఉంటున్నారు.
నమ్మించి బోల్తా కొట్టిస్తారు
సైబర్నేరగాళ్లు టెక్ట్స్, వాట్సాప్, ఈమెయిల్స్కు వివిధ రకాల మెసేజ్లు పంపిస్తుంటారు. అందులో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్లను క్లిక్ చేస్తే మీరు నిండా మునుగుతారు. సైబర్ నేరగాళ్లు భారీ లాభాలంటూ ఆశ పెట్టి వల వేస్తారు. సెల్ఫోన్లో చేసే పనే కదా ఇంట్లో కూర్చొని చేద్దామనే భావనతో చాలామంది ఆశకు పోయి పెట్టుబడులు పెడుతూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొంటున్నారు. అరగంటలో పెట్టుబడిపై 30 శాతం లాభాలు ఎక్కడా రావు. కష్టపడకుండా డబ్బు ఊరికే రాదు. పార్ట్టైమ్, ఇన్వెస్ట్మెంట్ అనే మెసేజ్లు వస్తే వాటికి స్పందించవద్దు.
-కేవీఎం ప్రసాద్, సైబర్ క్రైమ్స్ ఏసీపీ