హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మా కంపెనీలో పార్ట్టైమ్ ఉద్యోగాలున్నాయని, రూ.5 వేల వరకు సంపాదించవచ్చని సెల్ఫోన్లకు మెసేజ్లు పంపిస్తూ మోసం చేస్తున్నారు. ఓ మోస్తరు పేరున్న కంపెనీల పేర్లను వాడుతుండటంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈజీగా సైబర్నేరగాళ్ల వలలో చిక్కి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. పేరున్న కంపెనీలు, ఆయా సంస్థల సీఈవోల పేర్లతో మెసేజ్లు పంపిస్తున్నారు. ఆయా పేర్లున్న కంపెనీల సీఈవోలు, మెసేజ్ల్లో వచ్చిన సీఈవోల పేర్లు ఒకటిగానే ఉండటంతో బాధితులు నమ్మేస్తున్నారు. ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నా.. కొంతమంది సాఫ్టువేర్ ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో వస్తున్న మెసేజ్లకు ఆకర్షితులవుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని నమ్మించడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఈ విషయమై సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులు అవసరమని ఏ కంపెనీ వాట్సాప్ నంబర్లకు మెసేజ్లు పంపించదని చెప్పారు. పార్ట్టైమ్ ఉద్యోగాలు ఇచ్చేవారు బాధితుల నుంచి డబ్బులు ఆశించరని, ఏ కంపెనీ వ్యక్తిగతంగా మెసేజ్లు పంపించి ఉద్యోగం చేయమని అడుగదని పేర్కొన్నారు. మెసేజ్ల ద్వారా అడిగారంటే అనుమానించి మోసమని గుర్తించి అప్రమత్తంగా ఉండాలన్నారు.