హైదరాబాద్ జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సైబర్ నేరాలను క్షేత్రస్థాయి నుంచి నివారించేందుకు సైబర్ ఆర్మీ సిద్ధమైంది. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ సైబర్ నేరాలపై విస్తృతంగా చర్చించేందుకు, ప్రతి ఇంటిలోనూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా సైబర్ ఆర్మీని సిద్ధం చేసింది. తెలంగాణ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ ఆర్మీకి అంకురార్పణ చేశారు. సైబర్ అంబాసిడర్ ప్లాట్ఫామ్ (సీఏపీ) కింద రాష్ట్రవ్యాప్తంగా 9,524 మంది విద్యార్థులు, 4,762 మంది టీచర్లకు సైబర్ నేరాల నివారణపై శిక్షణ కల్పించనున్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లోంచి స్కూలుకు నలుగురు చొప్పున చురుకైన విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. తెలంగాణ సైబర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పురుడుపోసుకున్న ‘సైబ్హర్’ను సీఏపీగా మార్చి, సైబర్ నేరాల నివారణకు విద్యార్థులనే ఆయుధాలుగా ఎంచుకున్నది పోలీస్ శాఖ. ఈ కార్యక్రమం మొత్తాన్ని పర్యవేక్షిస్తూ.. విద్యార్థులకు సైబర్ నేరాల నివారణపై శిక్షణ ఇచ్చేందుకు పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది ఉమెన్ సేఫ్టీ వింగ్.
సైబర్ అంబాసిడర్ల విధి:
విద్యార్థులకు, పోలీసులు, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, ప్రజారోగ్యం తదితర అంశాలపై బాధ్యతలు నిర్వహించే వారికి మధ్య వారధిగా ఉంటారు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, కమ్యూనిటీలోని వారికి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సైబర్ అంబాసిడర్లకు ఈ నెల 24 నుంచి దశలవారీగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 33 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను ఏడు యూనిట్లుగా తీసుకొన్నారు. ఒక్కో యూనిట్లో 334 నుంచి 350 స్కూళ్లను ఎంపిక చేసి, అందులోని విద్యార్థులకు నాలుగు సెషన్లలో వర్చులవ్గా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సైబర్ అంబాసిడర్లకు ఆగస్టు 11న గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. సైబర్ నేరాలపై అవగాహన, సోషల్ మీడియా తీరుతెన్నులు, పబ్లిక్ వైఫై, కుకీస్, పాస్వర్డ్స్, సెక్స్టింగ్, యూపీఐ ఫ్రాడ్స్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు.
రాష్ట్రంలో సైబర్ పెట్రోలింగ్
పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థలానే.. సైబర్ నేరాల నివారణకు సైబర్ పెట్రోలింగ్ను నిర్వహిస్తున్నాం. సైబర్ నేరాల నివారణ కోసం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. సురక్షితమైన కమ్యూనిటీలను నిర్మించేందుకు సైబర్ అంబాసిడర్లు నిరంతరం కృషి చేస్తారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్టవేసే వేదిక దొరికింది. ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి పనులు అందరిలోనూ భరోసానిస్తాయి.
– అంజనీకుమార్, డీజీపీ
సైబర్ నేరాలపై యుద్ధం చేద్దాం
రాష్ట్రంలో సైబర్ నేరాలను ప్రాథమిక దశలోనే అడ్డుకునేందుకు మా సైబర్ అంబాసిడర్లు సిద్ధంగా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఓ సైబర్ ఆర్మీని ఏర్పాటు చేయడం, దాన్ని ఉమెన్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షించడం సంతోషంగా ఉన్నది. మా ప్రయత్నానికి కలిసివచ్చిన విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు.
– శిఖాగోయల్, ఏడీజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్