హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన నీటి పారుదల ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర ప్రభుత్వం కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. ఆరు నెలల్లోగా అన్ని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలని ఒకవైపు షరతు పెట్టి, మరోవైపు అనుమతులు ఇవ్వటంలో అంతులేని జాప్యం చేస్తున్నది. కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గత ఏడాది జూలై 15న గెజిట్ జారీచేసిన విషయం తెలిసిందే. దాని ప్రకారం అనుమతిలేని ప్రాజెక్టులన్నింటికీ ఆరు నెలల్లోగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. లేదంటే ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల నిర్వహణతోపాటు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులను కూడా నిలిపివేయాలని షరతు విధించింది. ఈ షరతుకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టుల డీపీఆర్లు ఎప్పుడో సమర్పించినా ఇప్పటికీ అనుమతులివ్వకుండా కాలయాపన చేస్తున్నది.
నీరుందని చెప్తూనే అడ్డంకులు..
వాస్తవంగా గోదావరి నదిపై చేపట్టిన ప్రాజెక్టుల అనుమతుల మంజూరుకు ఎలాంటి అడ్డంకులు లేవు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరి జలాల్లో తెలంగాణకు 967.94 టీఎంసీల కేటాయింపులున్నాయి. అందులో ఇప్పటికే 758.76 టీఎంసీల వినియోగానికి చేపట్టిన ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతులున్నాయి. మరో 148.82 టీఎంసీలకు సైతం గతంలోనే హైడ్రాలజీ విభాగం అనుమతి ఇచ్చింది. భవిష్యత్తు అవసరాల కోసం 60.26 టీఎంసీలను రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్లో పెట్టింది. నీటి లభ్యతతో పాటు, ట్రిబ్యునల్ కేటాయింపులు కూడా ఉండటంతో ఆయా ప్రాజెక్టులకు అనుమతులు పొందడానికి అడ్డంకులేమీ లేవని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. అయితే, నీటి లభ్యతపై ఉన్నదో? లేదో? మరింత లోతుగా పరిశీలించాల్సి ఉన్నదని చెప్తూ సీడబ్ల్యూసీ తీవ్ర కాలయాపన చేస్తున్నది. కేంద్ర జల్శక్తి శాఖకు విరుద్ధంగా సీడబ్ల్యూసీ వ్యవహరిస్తున్నదని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు మండిపడుతున్నారు.
ప్రాజెక్టులవారీగా సవాలక్ష కొర్రీలు
గోదావరిపై ఉన్న 11 ప్రాజెక్టులకుగాను, ఆరింటిపై పూర్తిస్థాయి నివేదికలను సీడబ్ల్యూసీతోపాటు జీఆర్ఎంబీకి రాష్ట్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లోనే సమర్పించింది. వాటి అనుమతులకు సీడబ్ల్యూసీ సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. పర్యావరణం, ఫైనాన్స్, ఇరిగేషన్ తదితర విభాగాలు అనుమతిచ్చినా సీడబ్ల్యూసీ మోకాలడ్డుతున్నది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్నదని కేంద్ర జల్శక్తి శాఖ స్వయంగా చెప్పిన సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులకు కూడా అనుమతి ఇవ్వలేదు. శాస్త్రీయ అధ్యయనం పేరుతో దశాబ్దాల కిందటి రికార్డులను తిరగేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాల తెలుపుతున్నదంటూ సాకులు చెప్తున్నది. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు ఏపీకి 45 రోజుల గడువిచ్చింది. ఆ గడువు ముగిసినా ఏపీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. అయినా సీడబ్ల్యూసీ అనుమతులివ్వకుండా అగ్ని పరీక్ష పెడుతున్నది. క్యాచ్మెంట్ ఏరియాలో లభ్యమయ్యే నీటి ఆధారంగా చేపట్టిన మోడికుంట ప్రాజెక్టుకు కూడా అనుమతులివ్వకుండా వేధిస్తున్నదని రాష్ట్ర అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఏపీ ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు డీపీఆర్ కూడా సమర్పించకపోగా, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వరాదని సీడబ్ల్యూసీపై ఒత్తిడి తెస్తున్నది. సీడబ్ల్యూసీ కూడా ఏపీ మాటే వింటున్నదని తెలంగాణ ఇంజినీరింగ్ అధికారులు మండిపడుతున్నారు. సీడబ్ల్యూసీ అడిగిన ఆధారాలన్నీ పట్టుకొని వారానికోసారి ఢిల్లీకి పరుగు తీయాల్సి వస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో కూడా సీడబ్ల్యూసీ ఇలాగే వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు.