Telangana Decade Celebrations | నాడు, గడిగడికి కరెంటు కోతలు.. పరిశ్రమలకు పవర్ హాలిడేలు.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు.. తెగిపడిన విద్యుత్తు వైర్లు.. ఎండిపోయిన పొలాలు.. రాలిపోయిన జీవితాలు..
నేడు, రైతులకు కరెంటు కోతల్లేవు.. రాత్రిపూట పాముకాట్లు లేవు.. కావాల్సినంత ఉచిత కరెంటు.. పండించుకున్నన్ని పంటలు.. విద్యుత్తు వినియోగంలో రికార్డులు..
ఆదా చేసినందుకు అవార్డులు..
హైదరాబాద్: తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని శాపాలు.. విద్యుత్తు వ్యవస్థలు కుప్పకూలిపోతాయని జోస్యాలు.. ఆ శాపం పనిచేయలే, ఆ జోస్యం నిజం కాలే. తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తును అందించి దేశమే ఆశ్చర్యపోయేలా చేసింది తెలంగాణ. 2014 జూన్ 2 నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రాష్ట్రంలో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. తెలంగాణను అగ్ర స్థానంలోకి చేర్చాలంటే ముందుగా విద్యుత్తు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించిన సీఎం కే చంద్రశేఖర్రావు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి గ్రామాల్లో 12 నుంచి 16 గంటలు, మండల కేంద్రాల్లో 8 నుంచి 12 గంటలు, జిల్లా కేంద్రంల్లో 6 నుంచి 10 గంటలు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ విద్యుత్తు కోతలు ఉండేవి. ఇక పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు. వ్యవసాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పేరుకే 6 గంటలు.. కానీ పగలు రెండు, మూడు విడతల్లో 3 గంటలు.. రాత్రిపూట రెండు, మూడు విడతల్లో 3 గంటల పాటు విద్యుత్తును ఇచ్చేవారు. రైతుల జీవితాలు రాత్రిపూట చేలల్లో, పొలాల్లోనే గడిచేవి.
అప్పట్లో దాదాపు 2,700 మెగావాట్ల విద్యుత్తు లోటు ఉండేది. పంటలు పండక, అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు అప్పట్లో కామన్. ఈ సమస్యపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన సీఎం.. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావును నియమిస్తూ జీవో నంబర్ 1 విడుదల చేశారు. మొట్టమొదటి సమీక్ష కూడా విద్యుత్తుపైనే. స్వల్ప, దీర్ఘ, మధ్యకాలిక లక్ష్యాలు నిర్దేశించారు. అందులో భాగంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలను 16.83 శాతం నుంచి 15.89 శాతానికి తగ్గించారు. 24 గంటల విద్యుత్తును మొదటగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అందించేలా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచారు. అవసరాలకు అనుగుణంగా స్వల్పకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. దీనితోపాటు ఎక్సేంజీ నుంచి కూడా విద్యుత్తును కొనుగోలు చేశారు. విద్యుత్తు సంస్థల కార్మికులు, ఉద్యోగులు ఏకతాటిపై నిలిచి సొంత రాష్ట్రం కోసం రాత్రిపగలు శ్రమించారు. ముందుగా వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు అందించారు. రోజురోజుకూ విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తూ.. ముందుకు సాగారు.
ఇందుకోసం రూ.39,321 కోట్లు ఖర్చుపెట్టారు. యావత్తు దేశం ఆశ్చర్యపడేలా 2018 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా, నాణ్యమైన పూర్తి ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు దేశంలోనే అత్యంత నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్తు 24 గంటలపాటు ఎక్కడ ఉన్నదంటే.. ఒక్క తెలంగాణలోనే.
నిరుపేదలు, వ్యవసాయానికి పూర్తి ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2022-23లో రూ.11,500 కోట్లు సబ్సిడీగా అందించింది. దీనికి తోడు డిస్కంలకు రూ.9,161 కోట్ల అదనపు సబ్సిడీ (2016-17 నుంచి 2021-22 వరకు) అందించింది.
దేశంలోనే ఏ రాష్ట్రం కూడా చేయలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఆర్టిజన్లు అనే పేరుతో రెగ్యులరైజ్ చేసింది. ఇలా ట్రాన్స్కో, జెన్కో, రెండు డిస్కంలలో కలిపి మొత్తం 22,722 మందిని రెగ్యులరైజ్ చేసింది. ఇది దేశంలోని విద్యుత్తు రంగ చరిత్రలోనే రికార్డు.
చెందుతుందనడానికి తలసరి విద్యుత్తు వినియోగాన్ని కొలమానంగా చూస్తారు. ఈ లెక్కన దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్తు వినియోగం (యూనిట్లు) తెలంగాణలోనే ఉన్నది. 2021-22లో రాష్ట్రంలో 2,126 యూనిట్లు తలసరి విద్యుత్తు వినియోగం నమోదైంది. అదే సమయంలో దేశ సగటు తలసరి విద్యుత్తు వినియోగం కేవలం
వ్యవసాయానికి 24 గంటల పూర్తి ఉచిత విద్యుత్తు రైతాంగానికి ఎంతచేసినా తక్కువేనని.. అందుకే వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తును అందించాలనేది సీఎం కేసీఆర్ కల. దీనిని సాధించేందుకు విద్యుత్తురంగ కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు నిరంతరం శ్రమించారు. అందుకు ప్రభుత్వం నుంచి సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారం అందించారు. వ్యవసాయంతోపాటు రాష్ట్రంలోని ప్రతి రంగానికి 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తును అందించేందుకు వీలుగా రూ.39,321 కోట్లతో
ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేశారు.
ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, విద్యుత్తు లైన్లను గణనీయంగా పెంచారు. వ్యవసాయానికి 24 గంటల పూర్తి ఉచిత విద్యుత్తులో భాగంగా పైలట్ ప్రాజెక్టును 2017 జూలై 16 నుంచి మెదక్ జిల్లాలో, 18వ తేదీ నుంచి నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రారంభించారు. అక్కడ ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించి.. 6.11.2017 నుంచి 19.11.2017 వరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తును అందించి, సమస్యలను పరిష్కరించారు. 2018 జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్తును పూర్తి ఉచితంగా కొనసాగిస్తున్నారు. ఇది దేశంలోనే రికార్డు. అందుకే అనేక రాష్ర్టాల నుంచి అధికారులు, రైతులు, సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఇక్కడ రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్తును అధ్యయనం చేస్తున్నాయి.
రాష్ట్రం ఏర్పడినప్పుడు మన విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. గత 9 ఏండ్లలో దీన్ని రెట్టింపు కంటే ఎక్కువగా సాధించాం. ఈ తొమ్మిదేండ్లలో కేటీపీపీ నుంచి 600 మెగావాట్లు, 240 మెగావాట్లు లోయర్ జూరాల, 120 మెగావాట్లు పులిచింతల, 800 మెగావాట్లు కేటీపీఎస్ (స్టేజ్-7), 1,080 మెగావాట్లు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, 1,200 మెగావాట్లు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, 1,000 మెగావాట్లు ఛత్తీస్గఢ్ నుంచి, 5,273 మెగావాట్ల సౌర విద్యుత్తు, 128 మెగావాట్ల పవన విద్యుత్తు తదితరాలన్నింటితో కలిపి ప్రస్తుతం 18,567 మెగావాట్లకు స్థాపిత సామర్థ్యం చేరుకున్నది. దీనికితోడు మరో 8,485 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో ప్రతిష్ఠాత్మకంగా దామరచెర్లలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం ఉన్నది. ఎన్టీపీసీ రామగుండంలో 1,600 మెగావాట్ల విద్యుత్తు కేంద్రాలు కూడా ఉన్నాయి.
ఒకప్పుడు విద్యుత్తు ఉంటే వార్తగా చెప్పుకునేవారు.. ఇప్పుడు విద్యుత్తు పోతే వార్తగా చెప్పుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో 5,661 మెగావాట్లు (6.6.2014) గరిష్ఠ డిమాండ్ నమోదైంది. అదికాస్తా 15,497 మెగావాట్ల(30.3.2023)కు చేరుకున్నది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గరిష్ఠ డిమాండ్ నమోదైంది కేవలం 13,162 మెగావాట్లు (23.3.2014) మాత్రమే. అంటే ఉమ్మడి రాష్ట్రం కంటే ఇప్పుడు తెలంగాణలోనే అత్యధిక విద్యుత్తు డిమాండ్ నమోదైందన్న మాట. విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ దూసుకెళ్తున్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 128 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం (6.6.2014 నాడు) ఉండగా, 14.3.2023 నాడు ఏకంగా 297.89 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఇది కూడా ఒక రికార్డు.