హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): యాసంగిలో అంచనాలకు మించి సాగు అవుతున్నది. గత ఏడాది విస్తారంగా వర్షాలు కురవడం..ప్రాజెక్టులు, చెరువులన్నీ నీటితో కళకళలాడుతుండటంతో అన్నదాతలు ఏరువాక పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వరకు 28.56 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అయినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. అత్యధికంగా వరి 18 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 3.21 లక్షల ఎకరాలు, శనగ 3.27 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.07 లక్షల ఎకరాల్లో సాగైనట్టు పేర్కొన్నది. గత యాసంగిలో ఇదే సమయానికి కేవలం 14.81 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం.