హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో పప్పు దినుసుల పంటలసాగు పెంచాల్సిన అవసరం ఉందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. దేశ అవసరాలకు, ఉత్పత్తికి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నదని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) పప్పు దినుసులసాగు అవకాశాలపై రూపొందించిన నివేదికను గురువారం హాకాభవన్లో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో అత్యధిక జనాభా ప్రొటీన్ల కోసం పప్పుదినుసులను ఉపయోగిస్తున్నదని ఇక్రిశాట్ పరిశోధనలో తేలిందని చెప్పారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తి లేదని, ఇతరదేశాలపై ఆధారపడే పరిస్థితి పోవాలని ఆకాంక్షించారు. దేశంలో పప్పు దినుసులసాగు పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. దీన్ని ముందుగానే గమనించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పప్పుదినుసుల పంటలసాగు పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే కంది పంటను గతంలో 6 లక్షల ఎకరాల్లో సాగుచేయగా, ఇప్పుడు 20 లక్షల ఎకరాలసాగు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటన్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ చైర్మన్ రమాకాంత్ ఇనాని, సీఈవో ఖ్యాతి నరవనే, పరిశోధన బృందం డిప్యూటీ సీఈవో సుజాత తదితరులు పాల్గొన్నారు.