Telangana Decade Celebrations | హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల శాఖ భూముల్లో దశాబ్ది సంపద వనాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపడుతున్నందున వీటికి ‘తెలంగాణ దశాబ్ది సంపద వనాలు’ అని నామకరణం చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి ఆ స్థలాలను డీఆర్డీవోలకు నీటిపారుదల శాఖ అప్పగించాల్సి ఉంటుంది. రాబోయే నాలుగేండ్లపాటు మొక్కలు పెంచే బాధ్యతను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకొంటాయి.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవం నిర్వహించనున్నందున అదేరోజు దశాబ్ది సంపద వనాల్లో మొక్కలు నాటనున్నారు. వీటి బాధ్యతను గ్రామస్థాయిలో పంచాయతీ తీసుకుంటుంది. సంపద వనాలను ఏర్పాటు చేసేందుకు ఎకరం వరకు ఒక విభాగం, ఎకరం నుంచి 3 ఎకరాల వరకు మరొక విభాగం, 3 నుంచి 20 ఎకరాల స్థలాన్ని మరో విభాగంగా విభజించారు. ప్రతి సంపద వనానికి గేటు, ఆర్చ్ను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. మొక్కలు నాటడం, వాటి నిర్వహణకు ఉపాధి హామీ.. ఆర్చ్, గేట్ను ఏర్పాటు చేసేందుకు హరితనిధి నుంచి నిధులు సమకూర్చుకోవాలని సూచించారు. నీటిపారుదల, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. మొదటి దశలో దాదాపు 900 ఎకరాలను గుర్తించారు. ఈ భూమిలో 7 లక్షల వరకు మొక్కలు నాటి, దశాబ్ది సంపద వనాలు ఏర్పాటు చేయనున్నారు.