Telangana | నిరంతరాయ ఉచిత విద్యుత్తు వేల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కాళేశ్వరం జలాలకు తోడు 24గంటల కరెంటు తెచ్చిన ఫలితాలకు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులే ఉదాహరణ. గడిచిన 2014-15లో విద్యుత్తు వినియోగం 11,671 మిలియన్ యూనిట్లు ఉండగా, 2022-23నాటికి అది 19,938 మి.యూనిట్లకు చేరింది. అలాగే 68.17 లక్షల టన్నులుగా ఉన్న ధాన్యం ఉత్పత్తి 9 ఏండ్లలో 278.3 లక్షల టన్నులకు చేరింది.
(ఎక్కల్దేవి శ్రీనివాస్, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి) ఒక పని ఎంతవరకు విజయవంతమైందనేదానికి దాని ఫలితాలే సాక్ష్యం.. ఒక పథకం ప్రారంభిస్తే.. దానితో లబ్ధిదారుల జీవితాల్లో ఎంతవరకు మార్పు వచ్చిందనేదే సాక్ష్యం.. అలాంటిదే వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా. 24 గంటల విద్యుత్తు సరఫరాతో వ్యవసాయంలో వచ్చిన మార్పులు, ఫలితాలు మన కండ్లముందే కనిపిస్తున్నాయి. ఇవిగో సాక్ష్యాలు..
పెరిగిన విద్యుత్తు వినియోగం
వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తును అందించాలనే సీఎం కేసీఆర్ ఆశయాన్ని నెరవేర్చేందుకు దాదాపు మూడున్నర సంవత్సరాలు పట్టింది. కేసీఆర్ మార్గదర్శనం, సీఎండీ ప్రభాకర్రావు నాయకత్వం, విద్యుత్తు ఉద్యోగుల శ్రమతో మూడున్నరేండ్లలో దాదాపు రూ.18,332 కోట్లు ఖర్చుచేసి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేశారు. నల్లగొండ, కరీంనగర్ లాంటి జిల్లాల్లో చేపట్టిన ప్రయోగాలు విజయవంతం కావడంతో.. 2018 జనవరి ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును అందించడం ప్రారంభించారు. అప్పటి నుంచి గడిచిన ఐదున్నరేండ్లుగా ఇది కొనసాగుతూనే ఉన్నది. దాని ఫలితాలు ఏటికేడు కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్తును అందించారు. 2017లో ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో కొద్ది రోజులపాటు 24 గంటల విద్యుత్తును వ్యవసాయానికి సరఫరా చేశారు. అది విజయవంతం కావటంతో మరికొద్ది రోజులు రాష్ట్రం మొత్తం 24 గంటల విద్యుత్తును అందించి చూశారు. ఈ కాలంలో వచ్చిన సాంకేతిక సమస్యలను సరిచేసి 2018 జనవరి ఒకటి నుంచి 24 గంటలపాటు విద్యుత్తును అందిస్తున్నారు. అందుకే 2015-16తో పోల్చితే 2016-17లో వ్యవసాయానికి విద్యుత్తు వినియోగం 3,184 మిలియన్ యూనిట్లు పెరిగింది. 2017-18లో 3,867 మిలియన్ యూనిట్లు పెరిగింది. ఇది అంతక్రితం ఏడాదికంటే 26.9 శాతం అధికం. 2018-19లో 2,455 మిలియన్ యూనిట్లు (13.4 శాతం) అధిక వినియోగం నమోదయ్యింది. 2020-21లోనూ 987 మిలియన్ యూనిట్లు ((5.4 శాతం) అధికంగా వినియోగించారు. దీన్ని గమనిస్తే రైతాంగం 24 గంటల ఉచిత విద్యుత్తును అవకాశం ఉన్నంతమేరకు వాడుకొన్నట్టు అర్థమవుతున్నది.
సాగు విస్తీర్ణం (కోట్ల ఎకరాల్లో)
అన్ని పంటల సాగూ పెరుగుదల
వరితోపాటు కూరగాయలు, పండ్ల తోటలు, మెట్ట పంటలు, ఉద్యాన పంటల్లోనూ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2017-18తో (1.39 కోట్ల ఎకరాలు) పోల్చితే.. 2022-23 నాటికి మొత్తం పంటల సాగు 2.08 కోట్ల ఎకరాలకు పెరగడం గమనార్హం. ఈ కాలంలో మొత్తం పంటల సాగు విస్తీర్ణం దాదాపు 69 లక్షల ఎకరాలు.. అంటే 49.6 శాతం పెరగడం గమనించవచ్చు. ఈ పెరుగుదలకు కారణం 24 గంటల విద్యుత్తు ప్రధాన కారణమని చెప్పవచ్చు.
పెరిగిన వరి సాగు విస్తీర్ణం..
24 గంటల విద్యుత్తు సరఫరాతో రైతులు బీడు భూములను కూడా సాగులోకి తెచ్చారు. ముఖ్యంగా వరి సాగు గణనీయంగా పెరిగింది. 2017-18లో యాసంగి, వానకాలం కలిపి 3.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. 2018-19తో పోల్చితే 2019-20లో సాగు విస్తీర్ణం ఏకంగా 33 లక్షల ఎకరాలు పెరగింది. 2020-21 నాటికి రైతులు మరో 20 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకొచ్చి 1.06 కోట్ల ఎకరాలకు వరి సాగు విస్తీర్ణాన్ని చేర్చారు.
గడిచిన తొమ్మిదేండ్లలో వరి సాగు విస్తీర్ణం ఇలా.. (లక్షల ఎకరాలు)
పుట్లకొద్దీ ధాన్యం
కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో సాగునీరు పుష్కలంగా లభించటంతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్తు అందటంతో రాష్ట్రంలో వరిసాగు, దిగుబడి అసాధారణంగా పెరిగింది. 2016-17లోనే దీని ఫలితాలు రావడం మొదలయ్యాయి. 2015-16లో ఉత్పత్తి అయిన ధాన్యం 45.70 లక్షల టన్నులు. 2016-17లో ఇది 98.98 లక్షల టన్నులకు పెరిగింది. 2018-19లో కోటి టన్నుల (వానకాలం, యాసంగి కలిపి) ధాన్యాన్ని పండించారు. 2019-20 నాటికి ధాన్యం ఉత్పత్తి 1.80 కోట్ల టన్నులకు చేరగా.. 2022-23 నాటికి ఏకంగా 2.78 కోట్ల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతాంగం పండించింది.
గత 9 ఏండ్లలో ధాన్యం దిగుబడి ఇలా.. (లక్షల టన్నులు)
ఇదంతా 24 గంటల విద్యుత్తు ఫలితమే