CUET UG 2024 | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది సీయూఈటీయూజీకి 13,47,618 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, నిరుడుతో పోల్చితే ఈ ఏడాది దరఖాస్తుల తగ్గడం గమనార్హం. నిరుడు 8.03 లక్షల మంది అబ్బాయిలు, 6.96 లక్షల మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకొన్నారు. ఈసారి 7.17లక్షల మంది అబ్బాయిలు, 6.30 లక్షల మంది అమ్మాయిలు దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించారు.
సీయూఈటీలో మొత్తం మూడు సెక్షన్లు ఉన్నాయి. వీటిల్లోంచి కనిష్ఠంగా 6 సబ్జెక్టుల వరకు విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ఇంగ్లిష్కు 10లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. అతి తక్కువ దరఖాస్తులొచ్చిన సబ్జెక్టులు తీసుకొంటే సింధిబాషకు 8, కొంకణి 9, మైథిలి 50, టిబెటన్ 41, ఇటాలియన్ 51, డోగ్రీ 77, రష్యన్ 86, చైనీస్ 93 చొప్పున దరఖాస్తులొచ్చినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వివరించింది. దేశవ్యాప్తంగా మే 15 నుంచి 31 వరకు సీయూఈటీ (యూజీ) పరీక్షలు నిర్వహించనున్నారు.