హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ బిడ్డలకు పూర్తిగా అన్యాయం చేస్తున్నది. మన నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ఓ న్యాయం.. తెలంగాణకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. ఏపీకి గిరిజన వర్సిటీ మంజూరు చేయడంతోపాటు వైస్చాన్స్లర్నూ నియమించిన కేంద్రం.. తాజాగా ఆ వర్సిటీలో ప్రవేశాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జూలై 15 నుంచి ప్రారంభమయ్యే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) ద్వారా సీట్లను భర్తీచేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఏపీ ట్రైబల్ వర్సిటీ ఈ విద్యాసంత్సరం నుంచే పూర్తిస్థాయిలో మనుగడలోకి రానున్నది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 సెక్షన్ 94లోని షెడ్యూల్ 13 (3) ప్రకారం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాల్సి ఉన్నది. సెంట్రల్ యూనివర్సిటీ హోదాతో దీన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా కేంద్రం సమీపంలో 200 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఈ స్థలాన్ని పరిశీలించి, యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. అయినా ఈ అంశాన్ని కేంద్రం విస్మరిస్తున్నది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి ట్రైబల్ వర్సిటీ ఏర్పాటుకు వినతిపత్రాలను సమర్పిస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా పోరాడుతున్నారు. ఇటీవల కేరళలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలోను రాష్ట్ర అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయినా కేంద్రం మొద్దునిద్ర నటిస్తూ తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రూ.865 కోట్ల అంచనాలతో డీపీఆర్ను సిద్ధం చేశారు. ఐదేండ్లలో 2,500-3,000 విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించవచ్చని ఈ డీపీఆర్లో ప్రతిపాదించారు. ఈ నిధుల మంజూరులోనూ కేంద్రం సవతితల్లి ప్రేమను చూపుతున్నది. 2021-22 బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించిన కేంద్రం.. అందులోనూ కేవలం రూ.9.74 కోట్లే విదిల్చింది. 2022-23 బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించినప్పటికీ ఈ నిధులను ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాలకు ఇస్తామని చెప్పింది. ఏ రాష్ర్టానికి ఎన్ని నిధులన్నదీ వెల్లడించలేదు. దీన్ని చూస్తుంటే తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వడం ఇష్టంలేకనే కేంద్రం ఇలా చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది.
2019లో దేశవ్యాప్తంగా 16 సెంట్రల్ యూనివర్సిటీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సెంట్రల్ లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ గెజిట్ను విడుదల చేసింది. దీంట్లో ఏపీకి చెందిన గిరిజన వర్సిటీ కూడా ఉన్నది. తెలంగాణకు ఇస్తామన్న గిరిజన వర్సిటీ మాత్రం లేదు. కేంద్రం ఈ గెజిట్ ద్వారా ఏపీకి సెంట్రల్ వర్సిటీని సైతం మంజూరు చేసింది. తదనంతరం మధ్యప్రదేశ్లోని ట్రైబల్ వర్సిటీ వీసీగా ఉన్న ప్రొఫెసర్ టీవీ కట్టమణిని ఏపీ గిరిజన వర్సిటీ వైస్చాన్స్లర్గా నియమించింది. అంతేకాకుండా ఈ వర్సిటీలో 12 కోర్సులకు అనుమతి ఇచ్చింది. వీటిలో 6 డిగ్రీ కోర్సులు, 6 పీజీ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులకు ఈ విద్యాసంవత్సరంలోనే సీట్లను భర్తీచేసి, తరగతులు ప్రారంభించనున్నారు. కానీ, తెలంగాణ ట్రైబల్ వర్సిటీకి మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ ఇంకా ఆమోదమే తెలపలేదు.