హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు 3,679 కేంద్రాల ద్వారా 61,300 మంది రైతుల నుంచి 4.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. ధాన్యం సేకరణకు నిధుల సమస్య లేదని, ఇప్పటికే రూ.5,000 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిందని వెల్లడించారు.
గురువారం బీఆర్కే భవన్లోయాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పౌర సరఫరాలు, మారెటింగ్ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 కోట్ల 80 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 8 కోట్ల బ్యాగుల కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతున్నదని సీఎస్ వెల్లడించారు. వీటికితోడు మరో రెండున్నర కోట్ల గన్నీ బ్యాగులు జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి త్వరలోనే వస్తాయని చెప్పారు. రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటుచేశామని తెలిపారు.
రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలి
కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరుపాలని అధికారులను సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. సేకరించిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే చెల్లింపుల ప్రక్రియ సులభతరం అవుతుందని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపుతున్నామని, ఇప్పటివరకు 4.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంపామని వివరించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ అనిల్కుమార్, మారెటింగ్ శాఖ అధికారులు భాసర్, అరుణ్, రుక్మిణి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.