హైదరాబాద్ : నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పరిశీలించారు. స్పెషల్ సీఎస్లు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్లు సత్యనారాయణ, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మేడ్చల్ కలెక్టర్ హరీశ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే స్వగృహ ప్లాట్లలో నివాసం ఉన్న వారితోనూ సీఎస్ మాట్లాడారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండ్లగూడ, పోచారం స్వగృహ ప్లాట్ల సముదాయంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. షాపింగ్ కాంప్లెక్స్, ఎస్టీపీ, క్లబ్ నిర్మాణానికి చర్యలు చేపడుతామని, పెండింగ్ సమస్యలపై వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లలో పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిశీలనకై సీఎస్ స్థాయిలో తాను స్వయంగా వచ్చానని, రాష్ట్రంలో ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్నందున సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగస్తులకు, అన్ని వర్గాలకు ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామన్నారు. మొదట దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.