హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని అన్నారు.
ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక సురక్షిత చర్యలు చేపట్టాలని అన్నారు. సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అదే విధంగా ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యంగా ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాల్ పల్లి, ములుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయిందని, ఈ జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఇప్పటికే నిండిన అన్ని చెరువులు, కుంటల వద్ద ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే వెంటనే పునరుద్దరించాలని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు తలెత్తలేదని తెలిపారు.
గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులను పరిశుభ్రం చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తగు రసాయన పదార్థాలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంధన శాఖ, మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అర్వింద్ కుమార్తో పాటు అడిషనల్ డీజీ జితేందర్, పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, ఈ.ఎన్.సి లు మురళీధర్, గణపతిరెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు.