హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న జిల్లా సమీకృత భవన సముదాయం నిర్మాణ పనులను
వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బీఆర్కేఆర్ భవన్లో జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు, కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణి పోర్టల్కు సంబంధించిన విషయాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
‘ఫుడ్ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణం కోసం చర్యలు ముమ్మరం చేయాలి. టీఎస్ఐఐసీకి భూముల బదలాయింపు ప్రారంభించాలి. ఇటీవల మరో 7 జిల్లాలకు ప్రభుత్వం వైద్య కళాశాలలను మంజూరు చేసింది. మెడికల్ కాలేజీల కోసం భూమి కేటాయింపులను వెంటనే ప్రారంభించాలి.
ధరణిలో పెండింగ్ మ్యూటేషన్లు త్వరగా పూర్తి చేయాలి. దరఖాస్తులను సమీక్షించి ఈనెల 9 లోపు పరిష్కరించాలి. స్పెషల్ ట్రైబ్యునల్లో పెండింగ్ కేసులపై హియరింగ్ నిర్వహించాలని’ సీఎస్ అధికారులకు సూచించారు.