హైదరాబాద్ : ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శనివారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న క్రమంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వరుసగా రెండు రోజులు సెలవు రోజులు వస్తున్నందున, సెలవులను ఉపయోగించకుండా పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. రహదారులు, వంతెనలు దెబ్బతిన్న మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయాలని చెప్పారు. పోలీసు, నీటిపారుదల, రోడ్లు భవనాలు, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖలన్ని సమన్వయంతో పని చేయాలని సూచించారు.