హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎస్ వెంట డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీన ఉదయం సీఎం కేసీఆర్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తారని సీఎస్ తెలిపారు. ఇక అదే రోజు సాయంత్రం రవీంద్ర భారతిలో 30 మంది ప్రముఖ కవులచే కవి సమ్మేళనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.