హైదరాబాద్ : తెలంగాణలో కోతులు, అడవి పందుల బెడదపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్, పురపాలక శాఖ అధికారులతో పాటు వ్యవసాయ, పశుసంవర్ధక యూనివర్సిటీల వీసీలు హాజరయ్యారు.
కోతులు, అడవి పందుల నుంచి పంటలు దెబ్బతినకుండా కట్టడి చర్యలపై చర్చించారు. అటవీ, పశుసంవర్ధఖ, వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. కోతుల జనాభా పెరగకుండా చేపట్టే చర్యలతో పాటు స్టెరిలైజేషన్ కేంద్రాల ఏర్పాటును పరిశీలించాలని నిర్ణయించారు. కోతుల బెడద నుంచి తప్పించుకునే మార్గాలపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.