హైదరాబాద్ : మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో దేవాదాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్టీసీ, విద్యుత్, ఆర్ అండ్ బీ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
దేశంలోనే అతిపెద్ద గిరిజన వేడుక మేడారం జాతర అని సీఎస్ పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర కొనసాగనుందని తెలిపారు. ఈసారి కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు స్నానాల కోసం జంపన్న వాగులోకి నీటిని విడుదల చేస్తామన్నారు. భక్తుల కోసం 3,850 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని తెలిపారు. బస్సుల్లో 21 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందన్నారు. మేడారంలో ప్రధాన ఆస్పత్రితో పాటు 35 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. మేడారం పరిసరాల్లో 327 చోట్ల 6,700 టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.
మేడారం జాతరకు 9 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. జాతరలో తప్పిపోయిన పిల్లల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. భద్రతా పర్యవేక్షణకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు.