హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బీఆర్కే భవన్లో ఆదివారం టీజీవో, టీఎన్జీవో ఎంప్లాయిస్ యూనియన్ల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం.. జిల్లాలు, జోన్లు, మల్లీ జోన్లవారీగా వివిధ శాఖలవారీగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై భేటీ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్ల వారీగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రతినిధులతో సీఎస్ చర్చించారు. ఉద్యోగులందరికీ క్యాడర్ల వారీగా ఆప్షన్స్ ఇచ్చి, కేటాయింపు అవకాశం కల్పిస్తామని సీఎస్ వారికి హామీ ఇచ్చారు.
ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీజీఓ, ఎన్టీజీఓలతో పాటు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన జిల్లా స్థాయి ఉద్యోగుల సంఘాలను కూడా కేటాయింపు సమయంలో ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో లేని జిల్లాల్లో మొదటి దశలో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు సీఎస్ చెప్పారు. మిగిలిన జిల్లాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తివేసిన తర్వాత చేపట్టనున్నారు. ఈ సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు వీ మమత, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, ప్రతినిధులు పాల్గొన్నారు.