హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా అభివృద్ధి పయనంలో పయనించడానికి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా బ్యాంకర్లు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. శనివారం నగరంలోని బీఆర్కేఆర్ భవన్లో బ్యాంకర్లతో సీఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల వినియోగం పెరిగేలా మేళాలు, షాపింగ్మాల్స్లు, బ్యాంకు కౌంటర్లు, కొనుగోళ్ల కోసం ఇంట్రెస్ట్ రిబేట్లు, రుణ దరఖాస్తుల సరళీకరణ, రుణాల కోసం కొత్త పథకాలు, సత్వర నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
వినియోగదారులు వాహనాలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు విరివిగా కొనుగోలు చేసేలా రుణాలు అందించాలన్నారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకునేలా రుణాలను డ్రైవ్ మోడ్లో అందించాలన్నారు. అంతకుముందు సీఎస్ రిటేయిలర్లు, షాపింగ్ మాల్స్, టూర్ ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగానికి సంబంధించిన ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. వారి నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానించారు. వినియోగదారులను పెద్ద మొత్తంలో ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ఎస్సీడీడీ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సీసీటీ నీతూ కుమారి ప్రసాద్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సివిల సప్లయి కమిషనర్ అనిల్ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.