హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలపై బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్, డీజీపీ.. అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాల్లో భాగంగా 16వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 15 వేల మంది చొప్పున పాల్గొనేలా ర్యాలీలు నిర్వహించాలన్నారు. ర్యాలీల అనంతరం బహిరంగ సభలను నిర్వహించాలని సూచించారు. ప్రతి జిల్లాకు 10 వేల జాతీయ జెండాలను సరఫరా చేస్తామన్నారు. 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధుల చేత జాతీయ జెండాలను ఎగురవేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకై సీనియర్ ఆఫీసర్ను ప్రతీ నియోజకవర్గానికి నోడల్ అధికారిగా నామినేట్ చేయాలని ఆదేశించారు. ఇక 15వ తేదీ నుంచే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు, వాణిజ్య సంస్థలను విద్యుత్ దీపాలతో అలంకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు డీజీపీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జోంగ్డు, పీఆర్ అండ్ ఆర్డీ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టీఆర్ అండ్ బి శ్రీనివాసరాజు, రవాణా కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఓమర్ జలీల్, డైరెక్టర్ పీఆర్ అండ్ఆర్డీ హనుమంతరావు, డైరెక్టర్ ఐ అండ్ పీఆర్ రాజమౌళి, డైరెక్టర్ కల్చర్ మామిడి హరికృష్ణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.