Republic Day | ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి.. వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు. పబ్లిక్ గార్డెన్స్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని సీఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్శాఖను ఆదేశించారు. రాజ్భవన్, సచివాలయం, శాసనసభ, హైకోర్టు తదితర అన్ని ముఖ్యమైన ప్రభుత్వ భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని ఆర్అండ్బీ శాఖకు సూచించారు.
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని, తగిన పరిమాణంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖకు ఆదేశాలిచ్చారు. పారిశుధ్య పనుల పర్యవేక్షణ, ఆహ్వానితులందరికీ తాగునీటి సరఫరా చేపట్టాలని మున్సిపల్శాఖకు కోరారు. అలాగే ఇతర శాఖలు తగిన విధంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, పొలిటికల్ సెక్రెటరీ రఘునందన్రావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, గవర్నర్ సెక్రెటరీ సురేంద్ర మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పోలీస్, డిఫెన్స్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.