హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 1,216 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు గురువారం శంకుస్థాపన నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం ఏర్పాట్లపై బుధవారం ఆమె కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో శిల్పకళా వేదికలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
17న గిరిజనోత్సవం సందర్బంగా గిరిజన సర్పంచులు, ప్రజాప్రతినిధులను సన్మానిస్తామని తెలిపారు. 3,146 గిరిజన గ్రామాల్లో, భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీఏలలో ఈ గిరిజనోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. టెలికాన్ఫరెన్స్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.