హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): నూతన సచివాలయం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నదని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కార్యసాధనకు ఈ శ్వేత సచివాలయం ఒక నిదర్శమని తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టుదలను సూచించే విధంగా ఏనుగు లక్ష్మణ కవి రాసిన పద్యాన్ని ఆమె ఉటంకించారు.
ఆరంభింపరు నీచ మానవులు
విఘ్నా యాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు
విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్
ధ్రుత్యున్న తోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ
ప్రజ్ఞానిధుల్ గావునన్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహావిష్కరణ పండుగ సంబురాలు ఇంకా కండ్లముందుర కదలాడుతుండగానే ఆయన పేరుపై నిర్మించిన సచివాలయం ప్రారంభించుకోవటం ఆనందంగా ఉన్నదని సీఎస్ శాంతికుమారి చెప్పారు. కరోనా సమయంలోనూ పనులు ఆపకుండా, రికార్డుస్థాయిలో కేవలం రెండేండ్ల సమయంలో భవన నిర్మాణం పూర్తయిందని తెలిపారు. దేశంలోనే గోల్డ్ రేటింగ్ పొందిన ఏకైక భవనం ఇదేనని వెల్లడించారు. హిందూ, దక్కనీ, కాకతీయుల సంప్రదాయల సమ్మిళితంగా 28 ఎకరాల విస్తీర్ణంలో ఆరు అంతస్థుల్లో నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.
ప్రతి శాఖకు సకల సౌకర్యాలు, సాంకేతిక వసతులు కల్పించినట్టు చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే అనితరసాధ్యమైన అభివృద్ధి సాధించినట్టు వివరించారు. పరిపాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం అనేక పాలనా సంస్కరణలను చేపట్టిందని, కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త కలెక్టరేట్ల నిర్మాణంతో ప్రజలకు పాలనను దగ్గర చేసిందని తెలిపారు. పల్లెప్రగతి కారణంగా దేశంలో మన పల్లెలు 40 అవార్డులకు గానూ 13 అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘సార్.. మీ నేతృత్వంలో ప్రభుత్వం ఉద్యోగులందరం మీ అంచనాలకు అనుగుణంగా పని చేసి దేశంలో మెరికల్లాంటి ఉద్యోగులు ఎవరంటే తెలంగాణ ఉద్యోగులనే విధంగా పేరు తెచ్చుకొని, కష్టపడి పనిచేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా.. దేశానికి తెలంగాణ దిక్చూచిలా మారేలా చేస్తామని హామీ ఇస్తున్నాను’ అని తెలిపారు. ఇక కొత్త సచివాలయంలో పని చేయటం గొప్ప పురస్కారంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ అద్భుత భవన నిర్మాణాన్ని స్వప్నించి, తపించి, సాధ్యం చేసిన సీఎం కేసీఆర్కు ఉద్యోగులందరి తరుఫున ధన్యవాదాలు తెలిపారు.