CS Shanti Kumari | జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల కార్యర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 2న ఉదయం గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు సీఎం నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు, సందేశం ఉంటుందని తెలిపారు.
సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నట్టు చెప్పారు. దాంతో పాటు శిక్షణ పొందుతున్న 5వేల మంది పోలీస్ అధికారులు బ్యాండ్తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. ట్యాంక్ బండ్పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలతో తయారు చేసిన పలు వస్తువులతో పాటు నగరంలోని పేరొందిన హోటల్స్తో ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమానికి హాజరయ్యే నగరపౌరులతో వచ్చే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోదశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్యాంక్ బండ్పై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశశం ఉన్నందున వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ట్యాంక్బండ్పై సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకర్షణీయమైన బాణసంచా ప్రదర్శన తోపాటు లేజర్ షో ఏర్పాటు చేశామని శాంతి కుమారి చెప్పారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవీ గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దాన కిశోర్, శైలజా రామయ్యర్, శ్రీనివాస రాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, అడిషనల్ డీజీలు సంజయ్ కుమార్ జైన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నగర పోలీస్ అడిషనల్ కమిషనర్, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు, ఎన్పీడీసీఎల్ ఎండీ ముష్రాఫ్, హెచ్ ఎండీఏ అడిషనల్ కమిషనర్ ఆమ్రపాలి కాటా పాల్గొన్నారు.