CS Shati Kumari | నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయతీరాజ్శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి.. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు. సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
నగరంలో నీటి పరిస్థితిని ప్రస్తావిస్తూ సంబంధిత సీజీఎం ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టాలని.. ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. సీజీఎంలు ప్రతిరోజూ తమ పరిధిలోని మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
నాగార్జున సాగర్ నుంచి నీటి పంపింగ్ ఇప్పటికే ప్రారంభమైందని.. మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను హెచ్చరించారు. సీడీఎంఏ దివ్య మాట్లాడుతూ.. మంచినీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని, లీకేజీలు ఏవైనా ఉంటే వెంటనే సరిచేస్తున్నామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్ లైన్ని ఏర్పాటు చేశామని, నీటి సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.