హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న హైదరాబాద్లో పర్యటించనున్నారని, అందుకు సంబంధించి పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై డీజీపీ అంజనీ కుమార్తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… జూలై 4న సాయంత్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారని చెప్పారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్ చేపట్టాలన్నారు. విస్త్రృత బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, వైద్య బృందాలను నియమించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు.
ప్రొటోకాల్ను అనుసరించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ పేర్కొన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అర్వింద్ కుమార్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, ప్రభుత్వ కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాస రాజు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రంగారెడ్డి కలెక్టర్ హరీష్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బీ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.