హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత వానకాల సీజన్లో లబ్ధిదారులకు రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయం అందించాల్సి ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ వేగవంతం చేసి వారంలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. పోడు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను రైతుబంధు పోర్టల్లో నమోదు చేయాలని, రెవెన్యూ, పోలీసు, అటవీశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోడు భూముల పట్టాల పంపిణీ పురోగతిని ఆమె సమీక్షించారు. గృహలక్ష్మి పథకం, ఎరువులు, విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, బీసీ చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం, గొర్రెల పంపిణీ పథకం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం తదితర అంశాలపైనా సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాల నిల్వలపై కలెక్టర్లు రోజూ పర్యవేక్షించాలని, జిల్లాలో సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి స్టాక్ పొజిషన్ సరిచూసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. బీసీ చేతివృత్తిదారులకు ఆర్థిక సాయం కింద అందిన దరఖాస్తులన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.