హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సీఎమ్మార్పై జరిగిన సమీక్షలో కలెక్టర్లపై సీఎస్ శాంతికుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిర్ణీత గడువులోగా సీఎమ్మార్ పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేసినట్టు సమాచారం. సీఎమ్మార్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, ఆలస్యమైనా సర్వీస్ రికార్డు (ఎస్ఆర్)లో రిమార్స్ రాయాల్సి వస్తుందని హెచ్చరించినట్టు తెలిసింది. కొన్ని రోజులుగా కలెక్టర్లు సీఎమ్మార్ను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో పౌరసరఫరాల సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లుతున్నది. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. దీనిపై సోమవారం జరిగిన సమీక్షలో కలెక్టర్లకు సీఎస్ స్పష్టమైన ఆదేశాలు, హెచ్చరికలు జారీచేసినట్టు తెలిసింది.
ఆరుగురు కలెక్టర్లపై తీవ్ర ఆగ్రహం
సీఎమ్మార్ పెండింగ్లో ఉన్న వనపర్తి, నాగర్కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, నల్లగొండ, కామారెడ్డి కలెక్టర్లు, సివిల్సైప్లె అధికారులపై సీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సీఎమ్మార్ ఆలస్యంపై ఇప్పటికే తాను చాలాసార్లు హెచ్చరించానని, అయినా, ఎలాంటి మార్పు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎమ్మార్లో నిర్లక్ష్యం వహించే కలెక్టర్లు, ఇతర అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది.
మిల్లర్ల విషయంలో ఉదారంగా ఉండొద్దని, నిర్ణీత గడువులోగా సీఎమ్మార్ అప్పగించేలా వారిపై ఒత్తిడి తేవాలని సూచించినట్టు సమాచారం. సకాలంలో సీఎమ్మార్ ఇవ్వలేని మిల్లులను సీఎమ్మార్ నుంచి తప్పుకోవాలని ఆదేశించాలని చెప్పినట్టు తెలిసింది. నిబంధనలు అతిక్రమించే, సీఎమ్మార్ ఆలస్యం చేసే మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆదేశించినట్టు సమాచారం. మొత్తంగా నిర్ణీత గడువులోగా సీఎమ్మార్ అందేలా కలెక్టర్లు చూడాలని, ఈ అంశాన్ని ప్రాధాన్య అంశాల్లో చేర్చుకోవాలని సీఎస్ ఆదేశించినట్టు తెలిసింది.