ఖమ్మం : కరోనా రెండో దశ ఉధృతితో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్ చొరవ తీసుకొని స్వయంగా రంగంలోకి దిగి ఐటిసి యజమాన్యాన్ని ఒప్పించారు. నేటి నుంచి ఐటీసీ భద్రాచలం నుంచి ప్రతి రోజు ఖమ్మంకు అయిదు మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి ఆయా ఆక్సిజన్ రవాణాకు ప్రత్యేకంగా ట్యాంకర్ ను సమకూర్చారు.
ఆక్సిజన్ ట్యాంకర్ ను జిల్లా ప్రభుత్వ దవాఖానలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్ తో కలిసి మంత్రిఅజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రతి రోజు సరఫరా అయ్యే ఐదు మెట్రిక్ టన్నుల ప్రాణ వాయువు ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రులకు సరిపడా ఆక్సిజన్ ను అందించనున్నామని తెలిపారు.
ఇక ఆక్సిజన్ కు ఎలాంటి కష్టాలు ఉండబోవన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో మాలతి, దవాఖాన సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వైద్యులు, సిబ్బంది ఉన్నారు.