హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. మంగళవారం 29 కంపార్ట్మెంట్లు నిండి బయట 2 కిలోమీటర్ల మేర భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నదని టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి పవిత్రోత్సవాల సందర్భంగా దర్శనానికి ఆలస్యం అవుతున్నదని పేర్కొన్నారు. కాగా, సోమవారం శ్రీవారిని 74,830 మంది భక్తులు దర్శించుకొన్నారని, హుండీ ఆదాయం రూ. 4.79 కోట్లు వచ్చిందని తెలిపారు. బుధవారం పూర్ణాహూతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.