యాదాద్రి, అక్టోబర్ 29: యాదాద్రిలో కార్తీకమాసం సందడి మొదలైంది. శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు సత్యనారాయణస్వామి వత్రాలు, దీపారాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 454 మంది దంపతులు వ్రతపూజలో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవను అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం తర్వాత స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి సేవ కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం నిత్య తిరుకల్యాణోత్సవాన్ని జరిపించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.26,92,128 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.