యాదాద్రి, ఆగస్టు 27: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో శనివారం భక్తుల సందడి కనిపించింది. అష్టభుజి ప్రాకారం నుంచి త్రితల రాజగోపురం వరకు క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. ఉదయం తిరువారాధన, నిజాభిషేకం, స్వామి, అమ్మవార్లకు సహస్రనామార్చన చేశారు. సా యంత్రం ఉభయ జోడు సేవలు, దర్బా ర్ సేవ నిర్వహించారు. స్వామి వారిని 30 వేల మంది దర్శించుకోగా.. ఖజానాకు రూ.34,17,150 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు.
జూలై 29న ప్రారంభమైన ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’కు ప్రధానార్చక బృందం ముగింపు పలికింది. నెలరోజులపాటు 30 మంది రుత్వికులు కోటి 8 లక్షల జపాన్ని పూర్తి చేశారు. దీంతో మూలస్థానంలో ఉన్న అమ్మవారి మహా యంత్రానికి అద్భుతబలం చేకూరిందని ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు.