హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సరళిని మార్చాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ కే హనుమంతు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, విస్తరణ సలహామండలి రెండో సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, వర్షాలు, వరదల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.
వర్సిటీ వైస్చాన్స్లర్ డాక్టర్ ప్రవీణ్రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో వ్యవసాయం మరిన్ని సవాళ్లను ఎదుర్కోనున్నదని, పరిమిత వనరులతోనే విస్తృత వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు వివిధ పంటలకు చెందిన 54 కొత్త వంగడాలను విడుదల చేసినట్టు పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ తెలిపారు. పశుగ్రాసం కొరత తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. అనంతరం యూనివర్సిటీలో నిర్మించిన కొత్త అకడమిక్ బ్లాక్ను ప్రవీణ్రావు ప్రారంభించారు. సమావేశంలో విస్తరణ విభాగం డైరెక్టర్ డాక్టర్ సుధారాణి, శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల సమన్వయకర్తలు, రైతులు, విత్తన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.