చండీఘడ్ : కరోనా మహమ్మారితో జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడే దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న కుటుంబాలకు రూ 5000 నగదు సాయం అందిస్తామని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ విధించిన క్రమంలో జీవనోపాధి కోల్పోయిన బీపీఎల్ కుటుంబాలకు నగదు సాయం అందించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ మరికొంత కాలం కొనసాగుతుందని చెప్పారు. మే 10 నుంచి మే 17 వరకూ సురక్షిత్ హర్యానా పేరిట కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. లాక్డౌన్ కు తోడు కఠిన నియంత్రణలను అమలు చేస్తామని చెప్పారు. అంత్యక్రియలు, వివాహ వేడుకల్లోనూ 11 మందికి మించి గుమికూడేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇక గడిచిన 24 గంటల్లో హర్యానాలో 13,548 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 151 మంది మహమ్మారి బారినపడి మరణించారు.