Jangaon | జనగామ రూరల్, జనవరి 26: తెలంగాణ రాకముందు ఎట్లుండె మన పల్లెలు అంటే.. నెర్రెలిచ్చిన నేలలు. పాడుబడ్డ బావులు.. ఒట్టిపోయిన చెరువులు కనిపిస్తుండే. మళ్లీ అలాంటి పరిస్థితులే ఇప్పుడూ దాపురిస్తున్నాయి. పదేండ్లపాటు పండుగైన వ్యవసాయం మళ్లీ.. దండుగలా మారే పరిస్థితి రాబోతున్నది. అందుకు సాక్ష్యమే జనగామ జిల్లాలో దుస్థితి. గోదావరి జలాలు రాక, విద్యుత్తు సరఫరా సరిగా లేక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. వాస్తవానికి జనగామ అంటేనే నీళ్లు లేక దుర్భిక్షంగా ఉండే ప్రాంతం. కేసీఆర్ సీఎం అయ్యాక ఈ ప్రాంతాన్ని మరో కోనసీమ చేశారు.
ప్రతి మారుమూల ప్రాంతానికి గోదావరి జలాలు అందించి బీడుభూములను సైతం సాగులోకి తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలోని చెరువును మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీయించి వాటిల్లో కాల్వల ద్వారా గోదావరి జలాలు నింపారు. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చాక నీళ్లను విడుదల చేయకపోవటంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జనగామ మండలంలోని ఎర్రకుంటతండా గ్రామంలో గతంలో దండిగా పండిన పంటలు నేడు నీరులేక ఎండిపోతుండటంతో దిగులు పడుతున్నారు. గతంలో బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా నీరు రావటంతో పంటలు వేసుకొని నీరు పెట్టుకునేది. ఇప్పుడు కనీసం ఎకరం కూడా సక్రమంగా పారుతలేదని వాపోతున్నారు. గోదావరి జలాలను విడుదల చేసి పంటలను కాపాడాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు.
నాకు 15 ఎకరాలు ఉన్నది. నీరు లేక ఐదెకరాలు నాటు పెట్టిన. మిగతాది పడావుగా ఉన్నది. అది కూడా పారుతాలేదు. గతంలో కాల్వల ద్వారా నీరు వచ్చేది. దాంతో పంటలు పండేటివి. ఇప్పుడు నీరు రాకపోవటంతో వేసిన పంట కూడా ఎండిపోయింది. మేము ఎట్లా బతకాలి? అధికారులు మా బాధను పట్టించుకొని నీటిని విడుదల చేసి పంటలకు జీవం పోయాలి.
– మాలోత్ సక్రు, రైతు ఎర్రకుంట తండా, జనగామ
నాకు 5ఎకరాలు ఉన్నది. కానీ, నీళ్లు లేక రెండు ఎకరాల్లోనే నాటువేసిన. అది కూడా సక్రమంగా పారుతలేదు. ఇప్పటికే పంట ఎండిపోవడంతో గోదావరి నీరు వస్తే కొద్దోగొప్పో పంట చేతికి వస్తుందని ఆశ మీద ఉన్న. గతంలో కాల్వ ద్వారా గోదావరి నీరు రావటంతో పంటలకు సరిపోయేది. ఇప్పుడు బోరుబావుల్లో కూడా నీరు అడుగంటిపోయింది. పంటలకు పెట్టుబడి రాకపోతే అప్పుల పాలై ఆత్మహత్యే శరణ్యం.
– గుగులోత్ కొమురయ్య, రైతు ఎర్రకుంట తండా, జనగామ మండలం