చేర్యాల, మార్చి 26 : సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో వందలాది ఎకరాల్లో వరి ఎండిపోతున్నది. అసలే దుర్భిక్ష ప్రాతం కావడం, కాంగ్రెస్ సర్కారు సాగునీరు విడుదల చేయకపోవడంతో దేవాదుల కాల్వలు చెత్తాచెదారంతో నిండి మూసుకుపోయాయి. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి, ఐనాపూర్ గ్రామాల మధ్య రిజర్వాయర్ నిర్మించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పదేండ్లపాటు దేవాదుల నుంచి నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్ నింపి అక్కడ నుంచి కాల్వల ద్వారా చేర్యాల ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపడంతో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల నుంచి పుష్కలంగా నీరు వచ్చి పంటలు దిగుబడి పెరిగింది. కాంగ్రెస్ వచ్చాక దేవాదుల నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకపోవడంతో తపాస్పల్లి రిజర్వాయర్ అడుగంటి పోవడంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు తగ్గిపోయి రైతుల బోర్ల నుంచి చుక్క నీరు రాకపోవడంతో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో సుమారు 1500 ఎకరాల్లో వరిపంట ఎండిపోయింది.
రిజర్వాయర్లు నింపి రైతుల పంటలు కాపాడాలని అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ, తపాస్పల్లికి చుక్క నీరు రానివ్వడం లేదు. చేర్యాల మండలం ముస్త్యాలలోని జక్కల, తాళ్ల చెరువు ఏటా గోదావరి జలాలతో నింపడంతో గ్రామంలో కరువు కనిపించకుండా పోయింది. కాంగ్రెస్ వచ్చాక ఈ చెరువుకు చుక్క నీరు రాలేదు. దీంతో గ్రామంలోని బోర్లు వట్టిపోయాయి. ఒక్కో రైతు రెండు,మూడు బోర్లు వేయించినా ఫలితం లేకుండా పోయింది. ముస్తాల్య గ్రామానికి చెందిన తరిగొప్పుల అంజయ్య అనే రైతు కుటుంబానికి నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది. పదేండ్లలో బోరు నుంచి పుష్కలంగా నీళ్లు వచ్చి పంటలు మంచిగా పండాయి. పదేండ్ల నుంచి మంచిగా నీరుపోసిన బోరు ఈ సారి ఎండిపోవడంతో పంటలు కాపాడుకునేందుకు అప్పు చేసి రైతు అంజయ్య మరోరెండు బోర్లు తవ్వించాడు. అందులో ఒక్క బోరు నుంచి దుబ్బ తప్ప ఏమీ రాలేదు. మరోబోరు నుంచి కొద్దిపాటిగా నీళ్లు వస్తుండటంతో మోటర్ బిగించాడు. నాలుగున్నర ఎకరాల్లో ఎకరన్నర ఎండిపోగా మిగిలిన మూడు ఎకరాలను కాపాడుకునేందుకు ముప్పుతిప్పలు పడుతున్నాడు.
కేసీఆర్ ఉన్నప్పుడు రెండు చెరువులకు నీళ్లు వచ్చినయి. ఇప్పుడు ఏమైందో ఒక్కచుక్క నీరు రాక చెరువులు ఎండిపోయినయి. బోరు నుంచి వచ్చే నీళ్లు రావడం లేదు. ఎకరన్నర వరి ఎండిపోయింది. రెండుబోర్లు వేయిస్తే ఒక్కటి పోయింది. ఇంకోదాంట్లో నుంచి కొద్దికొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ నీళ్లు వస్తున్నయి. పంట చేతికి వస్తుందో లేదో అనుమానంగా ఉంది. పంటలు చేతికి రాకపోతే మందు డబ్బానే దిక్కు. పది లక్షల రూపాయల అప్పులున్నయి. ఎట్ల అప్పులు తేర్పాలో తెల్వడం లేదు. మేస్త్రీ పనిచేస్తూ ఎవుసం చేసుకునేటోన్ని. ఇప్పుడు నీళ్లు లేక ఎవుసం నడవడం లేదు. నిర్మాణ పనులు సైతం తగ్గిపోయాయి. నాకు రుణమాఫీ కూడా కాలేదు.