Cyclone Michaung | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిగ్జాం తుఫాన్ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలతో 4.72 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వరిపైర్లు నేలవాలగా పత్తి, మిర్చి, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కోసిన వరి పైరుతోపాటు కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. రెండు రోజులపాటు కురిసిన వర్షం గురువారం తెరిపివ్వడంతో రైతులు ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. పొలాల్లో నీరు తొలగిస్తున్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను అంచనా వేస్తున్నారు.
మిగ్జాం తుఫాను ప్రభావం తెలంగాణపై కనిపిస్తున్నది. రెండ్రోజులుగా చలిగాలుల తీవ్రత పెరిగిం ది. ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఏపీలోని బాపట్ల తీరం దాటిన తుఫాన్.. ఉత్తరంగా పయనించే క్రమంలో బలహీనపడింది. బుధవారం మధ్యాహ్నానికి అల్పపీడనంగా మారి కోస్తా, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్కు ఆనుకొని తెలంగాణలోని ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతున్నది. ఇది ఛత్తీస్గఢ్ వైపు పయనించి గురువారం పూర్తిగా బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అంచనా వేసింది.
హైదరాబాద్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణం కంటే నగరంలో 6-7 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో చలితీవ్రత ఒక్కసారిగా పెరిగింది. తెల్లవారుజామున ఉదయం మంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరో నాలుగు రోజులపాటు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది.