ఆదివారం ఒక్కరోజే ఇద్దరు రైతులు తనువు చాలించారు. మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు గురై ఒకరు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గౌరయ్య అనే రైతు వడదెబ్బతో వరి కుప్పపైనే మృత్యుఒడిలోకి చేరాడు. ఈ ఘటనలు కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు చనిపోతుంటే, ప్రభుత్వం సంబురాలకు సిద్ధమవుతుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
హైదరాబాద్, మే 3(నమస్తే తెలంగాణ): పంటల కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ రైతులు రోడ్లెక్కుతున్నారు, ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కల్లాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. మక్క రైతుల గోస ఎవరికీ పట్టడం లేదు. జొన్నల కొనుగోళ్లను సర్కార్ మొదలే పెట్టలేదు. ఆయా పంటల రైతులు అరిగోస పడుతున్నారు. ఓవైపు సర్కార్ నిర్లక్ష్యం, మరోవైపు అకాల వర్షాలతో రైతులు కష్టాలు అనుభవిస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు గోసరిల్లుతుంటే కాంగ్రెస్ సర్కార్ పండుగలు నిర్వహిస్తున్నది. సోమవారం నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని సోమవారం తాండూరులో మంత్రి తుమ్మల ప్రారంభించనున్నారు. ఆధునిక సాంకేతిక ప్రదర్శనలు ఈ వారోత్సవాల్లో ఆకర్షణగా నిలుస్తాయని, రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి చెప్తున్నారు.
వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల కొనుగోళ్లలో సర్కార్ ఆలస్యం రైతులకు శాపంగా మారుతున్నది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం, ప్రారంభించిన చోట కొనుగోళ్లు మొదలు పెట్టకపోవడం, మొదలుపెట్టిన చోట కొర్రీలు, కోతలతో జాప్యం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 20 రోజుల నుంచి నెలరోజుల పాటు కల్లాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. తామంతా రోడ్లపై అరిగోస పడుతుంటే.. ఇదే సమయంలో పండుగలెలా చేస్తారు? అంటూ మండిపడుతున్నారు. పంటలు కొనడం చేతగావడంలేదు గానీ.. పండుగలు చేయడానికి ఉత్సాహం చూపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మక్క రైతుల గోస అంతా ఇంత కాదు. మక్కలను ఎంత వీలైతే అంత తక్కువ కొనుగోలు చేసేందుకు సర్కార్ ముందే ఓ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తున్నది. అందుకే కొనుగోలులో తీవ్ర తాత్సారం చేస్తున్నది. కావాలనే సమస్యలు సృష్టిస్తున్నది. గన్నీ సంచుల కొరతతో మక్క కొనుగోళ్లు నిలిచిపోయాయి. జొన్నల కొనుగోళ్లు ఇప్పటివరకు చేపట్టనేలేదు. శనగ సగం వరకు కొనుగోలు చేసి నిలిపివేసింది. కొనుగోళ్లలో జాప్యంతో రైతులు మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు.
గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షాలు రైతులకు తీవ్ర నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఎక్కడికక్కడే నిల్వ ఉన్న పంట దిగుబడులు తడిసిపోయి రైతులు దిగాలు చెందుతున్నారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం, నల్లగొండతోపాటు సిద్దిపేట, కరీంగనర్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వర్షానికి పంటలు కొట్టుకుపోయాయి. ఒకవైపు రైతులు పంటలు అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే..వాన దెబ్బతో రైతులు నష్టాల పాలవుతున్నారు. మరోవైపు రైతుల కష్టాలు తీర్చాల్సిన ప్రభుత్వం రైతు వారోత్సవాల పేరిట ఉత్సవాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటా నష్టాలు చవిచూస్తున్న రైతులు కష్టాలు, కన్నీళ్లతోనే ఉత్సవాల్లో పాల్గొనలా? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.