Crop Loan Waiver | స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణమాఫీ చేసింది. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసింది. ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఈ నెల 2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్.. ఆగస్టు 3 నుంచి రైతుమాఫీని ప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్రావు, అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రుణమాఫీలో ప్రక్రియ 3న ప్రారంభం కాగా.. తొలిరోజు రూ.41వేల లోపు 62,758 మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. విడుదల వారీగా రైతుల రుణాలను మాఫీ చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. మిగతా రైతుల రుణాలను సోమవారం ఒకేసారి రూ.99,999 లోపు ఉన్న 10.79లక్షల మంది రైతుల రూ.6,546.05కోట్లను మాఫీ చేసింది. ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్కు రైతాంగం ధన్యవాదాలు తెలుపుతున్నది.