హైదరాబాద్, ఆగస్ట్ 15 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో రైతన్న రుణ విముక్తుడవనున్నాడు. రెండో విడుత పంటరుణాల మాఫీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దఫాలో బ్యాంకుల్లో రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. మొత్తం 6,06,811 మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,006 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వేయనున్నారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడుత రుణమాఫీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో లాంఛనంగా ప్రకటించారు. ‘ఆగస్టు 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని 6 లక్షల మంది అన్నదాతలకు రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నాం. దీంతో మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణవిముక్తులు అవుతారు’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు మాదిరిగానే రుణమాఫీ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. రైతుబంధు నిధులు ముందుగా ఒక గుంట నుంచి ఎకరా వరకు విడుదల చేసి, ఆ తర్వాత ఒక్కో ఎకరం పెంచుకుంటూ నిధులు మంజూరు చేశారు. రుణమాఫీలోనూ ముందుగా రూ.25 వేలు-26 వేల వారికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఒక్కో వెయ్యి పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో డబ్బు జమచేస్తారు. రూ.50వేల లోపు రుణాలున్నవారికి మాఫీ ప్రక్రియతో రెండో విడుత ముగుస్తుంది.
మాఫీ అయిన వెంటనే రైతుకు ఫోన్ సందేశం
రైతుల ఖాతాల్లో డబ్బు పడగానే రుణం మాఫీ అయినట్టు ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ పేరుతో లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ వెళ్లనున్నది. దీంతోపాటు ‘కొత్త పంట రుణానికి మీరు అర్హులు’ అని ఆ సందేశంలో పేర్కొంటారు. బ్యాంకులు సైతం రైతులకు రుణం మాఫీ అయినట్టు సీఎం కేసీఆర్ పేరుమీద సందేశం పంపనున్నాయి. రుణమాఫీ పొందిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని, ఆ మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఖాతా లేదా పద్దు కింద జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. లబ్ధిదారుల ఖాతాలను జీరో చేయాలని, అర్హులందరికీ కొత్తగా పంట రుణం ఇవ్వాలని ఇటీవలే ఆర్థిక మంత్రి హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు.
రైతుల పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
రుణమాఫీ అమలు నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదివారం రాష్ట్రంలోని రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాతల పక్షాన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రుణమాఫీపై ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించామని చెప్పారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయరంగానికి సీఎం కేసీఆర్ ఆసరాగా నిలిచారని, ఒకప్పుడు ఆకలితో తండ్లాడిన తెలంగాణను ఇప్పుడు దేశానికే అన్నపూర్ణగా నిలిపారని కొనియాడారు.
రుణమాఫీ తీరిది
2014 నుంచి 2018 వరకు రూ16,144.10 కోట్ల రైతు రుణాలు మాఫీ
2018లో రూ.25 వేల లోపు రుణాలున్న 2.96 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్లు మాఫీ