యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎవుసం చేద్దామంటే చేతిల పైసలు ఆడాలె. పంట ఏసేదాకనన్నా కాసులు కావాలె. గిన్నాన్ని పైసలుగూడ లేక మస్తుమంది రైతులు భూమిని పట్టించుకోలె. రైతుబంధు వచ్చినంక ఆ గోస తీరింది. చేతిల పైసలు ఆడినయ్. ఇత్తనాలు, ట్రాక్టర్ దున్నుడు.. ఒక్కటేంది బాగానే పనులైతున్నయ్. అందుకు ఉదాహరణే.. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన మెడబోయిన ఐలయ్య, ఆండాలు దంపతులు. 13 ఎకరాల భూమి ఉన్నా వ్యవసాయం చేసేందుకు డబ్బులు లేక ఐలయ్య చాలా ఇబ్బందులు పడ్డాడు. భూమిలో బోరు కూడా లేదు. పంట వేసినా లాభం లేదనుకొని బాధపడేవాడు. కానీ, రైతుబంధు వస్తున్నప్పటి నుంచి ఆ బాధలన్నీ తప్పాయి. ప్రతి సీజన్లో టంచనుగా రూ.65 వేలు ప్రభుత్వ సాయం అందుతుండటంతో ఓ సీజన్లో బోరు వేసుకొన్నాడు. మరో సీజన్లో ట్రాక్టర్ కొనుక్కొని, దాని కిస్తీలు కడుతున్నాడు. ఐలయ్య తన భూమిలో ట్రాక్టర్తో దున్నించేందుకే ప్రతి సీజన్లో రూ.40 వేల వరకు ఖర్చు వచ్చేది. రెండు సీజన్లకు కలిపి రూ. లక్ష వరకు ట్రాక్టర్ కిరాయి భారంగా మారింది. దీంతో రూ.3 లక్షల పెట్టి సొంతంగా ట్రాక్టర్ కొన్నాడు. ఆరు నెలలకు ఓసారి రూ.74 వేలు కిస్తీ కడుతున్నాడు. ఐలయ్య పేరు మీద 10 ఎకరాల భూమి ఉండగా రూ.50 వేలు, అతని భార్య ఆండాలు పేరు మీద 3 ఎకరాలకు రూ.15 వేలు వస్తున్నది. ఇద్దరికి కలిపి రూ.65 వేలు రావటంతో మిగిలిన డబ్బులను కలిపి ట్రాక్టర్ కిస్తీ కడుతున్నారు. రైతు బంధు సాయంతో ట్రాక్టర్ కిస్తీలు కడుతున్నామని, కిస్తీల బెంగ తీరుతున్నదని ఆ దంపతులు ఆనందపడుతున్నారు. అంతేకాదు.. ఏడాది క్రితం రైతుబంధు డబ్బులతోనే బోరు వేసుకొన్నట్టు ఐలయ్య చెప్పాడు. నాలుగేండ్ల కిందట ప్రభుత్వం ఐలయ్య కుటుంబానికి 20 వరకు గొర్రెలను అందజేసింది. అవి కుటుంబానికి కొండంత ఆసరానిస్తున్నాయని ఆ రైతు దంపతులు సంతోషంగా చెప్పారు.