హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని చెరువుల్లో మొసళ్ల సంఖ్య పెరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లాలోని 400 చెరువుల్లో చేపలతోపాటు మొసళ్లు పెరుగుతున్నాయి. వేసవిలో నీటి నిల్వలు తగ్గుతుండటంతో అవి బయటకు వస్తున్నాయి. మొసళ్లు చేపల వలలో చిక్కుకోవడం, నీటిని తాగడానికి వచ్చిన జంతువులపై దాడులు చేయడం వంటి ఘటనలు జరుగుతాయి. పదర మండలంలో మత్స్యకారులు వలలో చిక్కిన మొసలి ఈ నెల 12న చనిపోయినట్టు ఫారెస్ట్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనపై మత్స్యకారుల 14 బోట్లను సీజ్ చేసినట్టు మద్దిమడుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్వో ఆదిత్య తెలిపారు. నిందితులపై వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మొసళ్లని కొట్టడం, చంపడం చట్టరీత్యా నేరమని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.