హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై ప్రధాని మోదీ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్ర విజయాలను చిన్నవిగా చూపే ప్రయత్నం చేశారు. కేంద్రం నయాపైసా సాయం చేయకున్నా దేశంలో నూరు శాతం ఇండ్లకు నల్లా నీరు అందించిన తెలంగాణను విస్మరించి కొత్తగా ఈ ఘనత సాధించిన బీజేపీ పాలిత గోవాను ప్రశంసంచారు. వాస్తవానికి తెలంగాణ ప్రజల తాగునీటి కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడో తీర్చింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ 100 శాతం ఇండ్లకు నల్లా నీటిని అందించి ఏండ్ల క్రితమే ఈ ఘనత సాధించింది. ఈ జాబితాలో తెలంగాణ సరసన చిన్న రాష్ట్రాలైన గోవా, అండమాన్ నికోబార్, డయ్యూ డామన్, హర్యానా రాష్ట్రాలు నిలిచాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో ఇండ్లకు నల్లా నీటిని అందించిన ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కానీ, ప్రధాని మోదీకి ఇదేమీ కనిపించలేదు. గోవాలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ రాష్ట్రం గొప్ప మైలురాయిని సాధించిందని అభినందించారు. దేశంలోనే తొలిసారి వందకు వంద శాతం ఇండ్లకు నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణను మాత్రం మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదు.
కేంద్రం పైసా విదల్చకున్నా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ మహిళల క‘న్నీటి’ కష్టాలను తీర్చేందుకు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా 53,86,962 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయించి శుద్ధిచేసిన నదీ జలాలను అందిస్తున్నారు. మిషన్ భగీరథ ఎంతో మంచి కార్యక్రమమని, దానికి రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం మాత్రం నయాపైసా ఇవ్వలేదు. అయినా సీఎం కేసీఆర్ ఎక్కడా వెనకడుగు వేయకుండా పనులను పూర్తి చేయించారు. అంతేకాకుండా గజ్వేల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగానే ఈ పథకాన్ని ప్రారంభింపజేశారు. అయినా తెలంగాణను ప్రశంసించేందుకు మోదీకి నోరు రాకపోవడం గమనార్హం.
సోషల్ మీడియా విమర్శలు…
ప్రధాని మోదీ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీవి చిల్లర రాజకీయాలంటూ నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ‘కేవలం 2 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినందుకు గోవాను ప్రశంసించిన మోదీకి.. 54 లక్షల కుటుంబాలకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చిన తెలంగాణ విజయం కనిపించలేదా?’ అంటూ టీఎస్ఎండీసీ చైర్మన్ మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. బీజేపీ చిల్లర రాజకీయాలు దేనికోసమని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల గణాంకాలను మోదీ పట్టించుకోడని మరికొందరు.. ఆయన తెలంగాణను మరిచిపోతున్నారని ఇంకొందరు మండిపడుతున్నారు. మోదీ తాత జుమ్లా రాజకీయాలు చేస్తున్నాడని చిన్న పిల్లలు సైతం విమర్శిస్తున్నారు.
మోదీ ఏమన్నారంటే..
గోవాలో జరుగుతున్న ‘హర్ ఘర్ జల్ ఉత్సవ్’లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘గోవా నేడు ఒక మైలురాయి సాధించింది. హర్ ఘర్ జల్ సర్టిఫికెట్ పొందిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. దాద్రా నగర్ హవేలీ, డామన్-డయ్యూ కూడా హర్ ఘర్ జల్ సర్టిఫైడ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. ఈ ఘనత సాధించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.