CM Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): పొద్దున సుద్దులు.. పగలు తిట్లు.. ఇదే సీఎం రేవంత్ తీరు అంటూ పలువురు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడిన భాషపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎంలాంటి ఉన్నత పదవిలో ఉంటూ వ్యక్తిగతంగా దూషణలు చేయడం, అసభ్య పదజాలాన్ని వినియోగించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషనే ఇప్పుడు సీఎం స్థాయిలో ఉండి కూడా వాడటం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బహిరంగ సభ అయినా, అధికారుల సమావేశమైనా, విలేకరుల సమావేశమైనా.. ఇలా సందర్భం ఏదైనా సరే సీఎం రేవంత్రెడ్డి తిట్ల దండకాన్ని మాత్రం మానడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆదివారం కృష్ణా జలాల వివాదంపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ప్రతిసారి ఏకవచనం (నువ్వు)తో సంబోధించారు. దీనిపై తెలంగాణ సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఉద్యమనేత, పదేండ్లపాటు రాష్ర్టానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేతపై నోటికొచ్చినట్టు మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్రెడ్డికి పెద్ద, చిన్నా అనే ఇంగితం లేదని, కనీసం కేసీఆర్ వయసుకు, చేసిన పదవికైనా గౌరవం ఇచ్చి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు ఇరిగేషన్పై అవగాహన లేకే ఇరిటేట్ అయ్యారని సోషల్మీడియాలో నెటిజన్లు చురకలంటించారు. విషయం లేకపోవడంతో దాన్ని కప్పిపుచ్చుకొనేందుకుగానూ తిట్ల దండకం అందుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయాన్ని మర్చిపోయేలా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని పలువురు విమర్శించారు.
సుద్దులు చెప్పిన కొన్ని గంటల్లోనే!
ఆదివారం ఉదయం పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి.. రాజకీయ నాయకుల భాషపై సుద్దులు చెప్పారు. రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలు చెయ్యొద్దని, భాష హుందాగా ఉండాలంటూ మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ గ్రహీత వెంకయ్యనాయుడు చేసిన సూచనలు పాటిస్తామని చెప్పుకొచ్చారు. తీరా కొన్ని గంటలు కూడా గడవకముందే మళ్లీ పాత రేవంత్రెడ్డి బయటకొచ్చారు. మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో కేసీఆర్పై తిట్ల దండకం అందుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. సుద్దులు చెప్పడానికే కానీ తాను అచరణలో పాటించబోనని నిరూపించారు.