హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, సాక్షాత్తు కమిషనే నివేదికను బహిర్గతం చేయడంతో విద్యాకమిషన్ లక్ష్యంగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యాకమిషన్లో విద్యావేత్తలు, ప్రొఫెషనల్స్ ఎక్కడ అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సోషల్ మీడియాలో విద్యాకమిషన్పై విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఇలాంటి వాళ్లా.. మన విద్యావ్యవస్థను బాగుపరిచేది అన్న చర్చోపచర్చలు నడుస్తున్నాయి. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని విద్యాకమిషన్తో మన విద్యాకమిషన్ను పోల్చుతున్నారు. తెలంగాణ విద్యాకమిషన్లో విద్యారంగ నిపుణులు లేరని, రాజకీయ పునరావాస కేంద్రంగా విద్యాకమిషన్ను మార్చారని, ఇలాంటి వాళ్ల నుంచి మంచి రిపోర్టులు, నివేదికలను ఆశించలేమని టీచర్లు అభిప్రాయపడుతున్నారు.