హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వని 13 మంది రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని పౌరసరఫరాల సంస్థ ఆదేశించింది. 2019-20 యాసంగి సీజన్కు సంబంధించి 102 రైస్ మిల్లులు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి పడిన విషయం విదితమే. ఏడాది వరకు గడువు ఇచ్చిన ఎఫ్సీఐ, ఆ తర్వాత సీఎంఆర్ను తీసుకొనేది లేదని స్పష్టం చేసింది. దీంతో బియ్యం రికవరీ బాధ్యతను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ తీసుకొన్నది. సుమారు రూ.400 కోట్ల విలువైన బియ్యాన్ని రైస్ మిల్లర్ల నుంచి రికవరీ చేయకపోతే, ఆ నష్టాన్ని పౌరసరఫరాలశాఖ భరించాల్సి వస్తుంది.
ఇప్పటికే ప్రతినెలా బ్యాంకు వడ్డీ కూడా కార్పొరేషన్ చెల్లిస్తున్నది. రెండేండ్లకు పైగా జాప్యం కావడంతో 25 శాతం జరిమానాతో 100 క్వింటాళ్లకు బదులుగా 125 క్వింటాళ్లు ) బియ్యం ఇవ్వాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ అవకాశాన్ని కూడా మిల్లర్లు వాడుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయా జిల్లాల అధికారులకు బుధవారం ఆదేశాలిచ్చింది. బియ్యం ఎగ్గొట్టిన జాబితాలో అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 36, హనుమకొండలో 12, కరీంనగర్లో 12, వరంగల్ జిల్లాలో 6, సూర్యాపేటలో 6, యాదాద్రి భువనగిరిలో 5 రైస్ మిల్లులున్నాయి.