హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మిల్లర్లు 2020-21 యాసంగికి సంబంధించి సీఎమ్మార్ ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పౌరసరఫరాల సంస్థ హెచ్చరించింది. ఎఫ్సీఐ ఇచ్చిన గడువు ఈ నెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో మిల్లింగ్ను పెంచేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ అనిల్ కుమార్ అడిషనల్ కలెక్టర్లను ఆదేశించారు. గత యాసంగికి సంబంధించి మొత్తం 62.60 లక్షల టన్నుల సీఎమ్మార్ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 57.13 లక్షల టన్నులు సరఫరా చేశారు. ఇంకా 5.39 లక్షల టన్నులు ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పటికే ఎఫ్సీఐ పలుమార్లు గడువును పెంచింది. మరోసారి గడువు పెంచే అవకాశం లేకపోవటంతో సీఎమ్మార్ను వేగంగా అందించేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. గత యాసంగిలో కూడా మెజారిటీగా రా రైస్ తీసుకొంటామని కేంద్రం తెలిపింది. దీంతో రా రైస్ ఇవ్వటం మిల్లర్లకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో రా రైస్కు బదులుగా ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రం ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీంతో గత యాసంగి, ఈ వానకాలం సీజన్లకు కలిపి 6.05 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ తీసుకొనేందుకు కేంద్రం ఓకే చెప్పింది. అయినా మిల్లర్లు జాప్యం చేస్తుండడంతో పౌరసరఫరాల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.