Warangal | వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది 7.7 శాతం నేరాలు పెరిగాయని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. క్రైమ్ వార్షిక నివేదికను సీపీ ఇవాళ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోక్సో కేసులు 36 శాతం పెరిగాయన్నారు. మహిళలపై 18 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 12 కోట్ల విలువైన వస్తువులు, డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 18 మందిపై పీడీ యాక్ట్లు నమోదు చేశామన్నారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా, విక్రయించినా కఠినంగా శిక్షిస్తామన్నారు.
ఈ ఏడాది 1167 మహిళా మిస్సింగ్ కేసులు నమోదు కాగా, 90 శాతం చేధించామన్నారు. వరంగల్ నగరంలో సీసీ టీవీ కెమెరాలు పెంచుతామన్నారు. మహిళలపై నేరాలను, సైబర్ క్రైమ్ను అరికడుతామన్నారు. భూకబ్జాదారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. చిట్ ఫండ్స్ కంపెనీల వల్ల ఇబ్బందులు పడ్డవారికి న్యాయం చేస్తామన్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంకా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతామని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.